High Court : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా లోని సిగాచి ఫార్మా కంపెనీ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాద ఘటనలో ఎందుకు ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. తీవ్రంగా మందలించింది కూడా. పాశ మైలారం ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా సర్కార్ ఏం చేసిందంటూ ప్రశ్నించింది.
Telangana High Court Slams Sigachi Incident
పాశమైలరంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ఈ సంవత్సరం జూన్ 30వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో, బాధితులకు న్యాయం చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టులో (High Court) పిటీషన్ దాఖలు చేసిన మాజీ శాస్త్రవేత్త బాబు రావు. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఎంత మందిని అరెస్టు చేశారని న్యాయమూర్తి అడగగా, ఎవరిని అరెస్టు చేయలేదని సమాధానం ఇచ్చారు హోంశాఖ తరపున న్యాయవాది.
అంత మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సిగాచి కంపెనీ యాజమాన్యాన్ని బాధ్యులుగా నిర్ధారించేందుకు అనేక చట్టాలు ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని నిలదీశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్.
ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరైన వారి పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. ప్రమాదం వల్ల మరణించిన, గాయపడిన కార్మికులందరికీ త్వరగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హై లెవెల్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, ప్రస్తుతం జరుగుతున్న విచారణకు దానికి సంబంధం ఏంటని నిలదీశారు.
ఇంత పెద్ద ప్రమాదానికి సంబంధించిన విచారణలో నిర్లక్ష్యం తగదని, విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మూడు వారాలలో అన్ని వివరాలతో పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, ఆగస్టు 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.
Also Read : Minister Nara Lokesh Shocking Comments : కాళేశ్వరం ఎందుకు కట్టారని మేం అడిగామా..?
















