Telangana Govt Important Update : ప్ర‌స్తుతానికి గ్రామ పంచాయ‌తీల‌కే ఎన్నిక‌లు

స్ప‌ష్టం చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం

Hello Telugu - Telangana Govt Important Update

Telangana Govt : హైద‌రాబాద్ : స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్య‌క్ష‌త‌న ఈ కీల‌క మీటింగ్ జ‌రిగింది. ప‌లు అంశాల‌పై తీర్మానం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రిమండలి తీర్మానం చేయడం, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టును (High Court) ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలను మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది.

Telangana Govt Comments

ఈ పరిణామాలను చర్చిస్తూనే, ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15 వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచి పోయే ప్రమాదం ఉంది. దీంతో కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని వీలైనంత తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో శతవిధాలా ప్రయత్నించిన విషయాలను గుర్తుచేస్తూ ఈ అంశంపై న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్టు మంత్రులు వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రిమండలి భావించింది. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని, అలాగే, డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించింది.

ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రిమండలి తీవ్ర సంతాపం తెలియజేసింది. రాష్ట్ర ప్రజలకు వారందించిన జయ జయహే తెలంగాణ‌ రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని కేబినేట్ తీర్మానించింది. అందెశ్రీ కుమారుడు ఎ. దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు . గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

Also Read : Minister Atchannaidu Important Update : 46,62,904 మంది రైతుల‌కు రూ 3077.77 కోట్లు

Exit mobile version