హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. కానీ నడిపిస్తున్నదంతా కొంతమంది ఆంధ్రాకు చెందిన పెత్తందారులేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్ర పెత్తందారులు ఉన్నారని మండిపడ్డారు. వారందరు నోవాటెల్ హోటల్ లో కూర్చొని ఎవడికి ఎంత వాటా కావాలి అని మాట్లాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రొళ్లతో కలిసి రేవంత్ రెడ్డి తెలంగాణ ఖజానాను లూటీ చేస్తున్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ తనకు తెలుసని ప్రకటించారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఓ వైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన స్వంత పార్టీ బాస్ , ముఖ్యమంత్రిపై అభాండాలు వేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వెంటనే భగ్గుమంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు ఎందుకు ఆయన ఏపీని ప్రస్తావించారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.















