హైదరాబాద్ : నీట్ 2026 కు సంబంధించి సంచలన ప్రకటన వెలువడింది. పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ కావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సర్కార్ కొలువు తీరాక ఇలాంటి అక్రమాలకు కేరాఫ్ గా మారిందన్న విమర్శలు లేక పోలేదు. విద్యను పూర్తిగా వ్యాపారం, కాషాయ పరం చేయడం పనిగా పెట్టుకుంది. దీంతో అష్టకష్టాలు పడి చదువుకున్న విద్యార్థుల పాలిట ఇలాంటి పేపర్ లీకులు ఆశనిపాతంగా మారాయి. ఇక తాజాగా నీట్ పరీక్షను రద్దు చేయడంతో స్టూడెంట్స్ లబోదిబోమంటున్నారు. రద్దు షాక్తో తెలంగాణ నీట్ అభ్యర్థులు కుదేలయ్యారు . ఇదిలా ఉండగా ఈ పరీక్ష 199 కేంద్రాలలో నిర్వహించారు.
పరీక్ష రాసేందుకు 73,024 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా అందులో 71,304 మంది హాజరయ్యారు, హాజరు 97.64 శాతంగా నమోదైంది. గత్యంతరం లేక నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పదేపదే జరుగుతున్న ఈ అంతరాయాలు తమ మానసిక ఆరోగ్యం , భవిష్యత్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చాలా మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీల నుండి అందిన సమాచారం , చట్ట అమలు అధికారులు పంచుకున్న దర్యాప్తు నివేదికల ఆధారంగా అవకతవకలు , పేపర్ లీక్ ఆరోపణలపై మే 3న జరిగిన నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేసినట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్షను విడిగా ప్రకటించబోయే తేదీలలో తిరిగి నిర్వహిస్తామని ఏజెన్సీ పేర్కొంది. వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి , జాతీయ పరీక్షల విశ్వసనీయతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సమగ్ర విచారణ కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నివేదించింది.
