TTD : తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. మంగళవారం కీలక ప్రకటన చేసింది. దర్శనానికి సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ టికెట్లను జూలై 19 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది.
TTD Released October Darshan Quota
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.
శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ రిలీజ్ చేస్తుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.
