తిరుపతి : తిరుపతి లోని కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పోస్టర్లు, బుక్లెట్ను తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి ( ఈవో) ముద్దాడ. రవిచంద్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూన్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముందుగా జూన్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 5న అంకురార్పణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు.
జూన్ 6న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు ఈవో. జూన్ 9న సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం, జూన్ 10న గరుడసేవ, జూన్ 13న వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో తెలిపారు. విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, చలువ పందిళ్లు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు తదితర ఏర్పాట్లను ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముద్దాడ రవిచంద్ర.
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ వేణుగోపాలస్వామి, అమ్మవార్ల దివ్య అనుగ్రహాన్ని పొందాలని ఈ సందర్భంగా ఈవో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు తదితర అధికారులు పాల్గొన్నారు.

















