పోలవరం ప్రాజెక్ట్ లో మట్టి , రాతి నాణ్యతా పరీక్షలు

ప‌రిశీలించిన సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ బృందం

hellotelugu-PolavaramVisit

అమ‌రావ‌తి : పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సిఎస్ఎంఆర్ఎస్ ) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ బృందంలో మట్టి, రాతి నాణ్యతా నిపుణులు అన్వేష్. గౌరవ్ పాండే , ఉదయ్ చక్రవర్తి, హరీందర్ సింగ్ ప్రకాష్ ఉన్నారు. ఇటీవలనే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగిస్తున్న కాంక్రీట్ ను సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ లో ఈ సీ ఆర్ ఎఫ్ నిర్మాణానికి వినియోగిస్తున్న రాళ్లు , మట్టిని ఈ బృందం సభ్యులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ లో ఈ సి ఆర్ ఎఫ్ తో పాటు పలు కీలక నిర్మాణాల్లో రాళ్లు, మట్టిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. జలవనరుల శాఖ ఎస్ ఈ రామచంద్ర రావు, ఈఈ డి శ్రీనివాస్, ఎం ఈ ఐ ఎల్ జిఎం గంగాధర్, డీజీఎం మురళి పమ్మి, నాణ్యతా విభాగం డీజీఎం శంకరయ్య శాస్త్రవేత్తలకు అవసరమైన వివరాలు అందించారు. నాణ్యతా పరీక్షలను పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్ట్ లో వినియోగించే మట్టి, రాయి నిల్వ ఉన్న ప్రాంతాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. అక్కడ నమూనాలు సేకరించి ప్రాజెక్ట్ ఆవరణలోని ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించింది. నాణ్యత పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేసింది. కొంత మట్టిని తమ కేంద్ర పరిశోధనాలయంలో పరీక్షించేందుకు సేకరించింది. గ్యాప్ -1లో మట్టి, రాళ్ళ నాణ్యతను బృందం పరిశీలించింది. అదేవిధంగా ఇప్పటి వరకు గ్యాప్ 1లో జరిగిన పనుల్లో వినియోగించిన మట్టి, రాళ్లకు రింగ్ టెస్ట్ ను వీరు నిర్వహించారు. గ్యాప్ 1, 2 లో వినియోగిస్తున్న మట్టి, రాళ్లు, ఇసుక నాణ్యతను కూడా ఈ బృందం పరీక్షించింది. కొత్తూరులో పోలవరం ప్రాజెక్టులో వినియోగించేందుకు సిద్ధం చేసిన మట్టి నమూనాలను వీరు సేకరించారు. స్థానికంగా పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ మట్టిని కొంత తమ వెంట ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరి వెంట జలవనరుల శాఖ నాణ్యతా విభాగం అధికారులు జాన్ , రవికుమార్ ,తదితరులు ఉన్నారు.

Exit mobile version