హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ 2026 జాబితాలో ఇద్దరు తెలుగు పారిశ్రామికవేత్తలకు చోటు దక్కింది. ఈ ఏడాదికి గాను అండర్ 30 కి సంబంధించి జాబితాను వెల్లడించింది ఫోర్బ్స్. ఈ ఇద్దరిలో ఒకరు జెమో అంకుర వ్యవస్తాపకుడు శివ గణేష్ గడ్డం కాగా మరొకరు సామాజిక రంగంలో ఎదోద్వజా ఫౌండేషన్ వ్యవస్థపకుడు మధులాష్ బాబు క్రొవ్విడి ఉన్నారు. ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే వీరిని అండర్ -30 లిస్టులో చేర్చినట్లు తెలిపింది ఫోర్బ్స్ సంస్థ. ప్రాథమిక స్థాయి నుండే పిల్లలకు ఆర్థిక అక్షరాస్యతను బోధించాలనే సంకల్పంతో శివ గణేష్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పొదుపు, బడ్జెట్ రూపకల్పన, పెట్టుబడి, బీమా , పారిశ్రామికవేత్తగా ఎదగడం వంటి అంశాలను నేటి యువతకు, పిల్లలకు కామిక్స్ (చిత్ర కథల) రూపంలో సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఆయన జెన్ 5 అనే సంస్థను స్థాపించారు.
డిజిటల్ యుగంలో డబ్బు నిర్వహణ ఎంత ముఖ్యమో వివరిస్తూ, ఆయన చేసిన ఈ వినూత్న కృషికి గాను ఫోర్బ్స్ జాబితాలోని ‘ఫైనాన్స్ , వెంచర్ క్యాపిటల్’ విభాగంలో గణేష్ కు స్థానం లభించింది. గ్రామీణ విద్యార్థుల కోసం అత్యాధునిక ప్రయోగశాల పరికరాలను అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు హైదరాబాద్లో ఫౌండేషన్ ను స్థాపించారు. మధులాష్ చేపట్టిన వినూత్న ప్రాజెక్టు ఫ్లో బస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 60,000 మంది విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీంతో ఆయనను కూడా సామాజిక, సాంకేతిక సేవా రంగంలో తనను ఎంపిక చేసినట్లు ప్రకటించింది ఫోర్బ్స్.
