శాన్ ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. విశాఖనగరం ఐటి, డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు నారా లోకేష్.
కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఎకౌంట్ విధానాన్ని ప్రారంభించనునట్లు చెప్పారు. సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ స్పందించారు. తాము ప్రధానంగా యూఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. సెమీకండక్టర్లు, ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్ ప్రైజింగ్ సాఫ్ట్ వేర్, గ్లోబల్ మార్కెట్ లను అనుసంధానించే స్టార్టప్ లలో పెట్టుబడులకు ప్రస్తుతం తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
















