ఢిల్లీ : భారత దేశంతో రష్యా శాశ్వతమైన బంధాన్ని కలిగి ఉంటుందని స్పష్టం చేశారు రష్యా దేశా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన రెండు రోజుల పాటు ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈసందర్బంగా ప్రత్యేకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీతో భేటీ అయ్యారు. తన పర్యటనకు ముందు ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే ప్రత్యేకంగా తనతో సంభాషించింది. అభిప్రాయాలు , మనసులోని భావాలను పంచుకున్నారు పుతిన్. రష్యా అధ్యక్షుడు 130 నిమిషాలకు పైగా మాట్లాడారు. రష్యాలోని క్రెమ్లిన్ లో అంజనా ఓం కశ్యప్ , గీతా మోహన్ తనతో సంభాషించారు. ప్రత్యేకించి ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన పాలనా పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న కపటత్వాన్ని ఖండించారు.
ఇదిలా ఉండగా దాదాపు రెండు దశాబ్దాలలో ఏ భారతీయ టెలివిజన్ నెట్ వర్క్ తో పుతిన్ మాట్లాడక పోవడం విశేషం. రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రాబోయే సమావేశం గురించి ప్రస్తావించారు. ఇదే సమయంలో భారతదేశం-రష్యా సంబంధాల భవిష్యత్తు పథం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల పట్ల కూడా చర్చించారు. ఇదే సమయంలో శాంతి అనేది ముఖ్యమన్నారు. రష్యా ఎల్లప్పుడూ ఎవరితో యుద్దానికి దిగదన్నారు. కానీ తమ వరకు వచ్చినా లేదా తమ మిత్ర దేశంతో ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

















