హైదరాబాద్ : ప్రీ లాంచ్ పేరుతో ఏకంగా రూ. 300 కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన ఘనుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎట్టకేలకు తమిళనాడులోని చెన్నైలో పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుంది ఈడీ. తను కోట్లు కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగింది దర్యాప్తు సంస్థ. చెన్నైలో ఉన్న తనను శుక్రవారం ఉదయం 9.56 గంటలకు చెన్నైలో వల పన్ని పట్టుకుంది. తనను భద్రత మధ్య అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు.
ఇదిలా ఉండగా ఈడీ తనపై కేసు నమోదు చేసిన వెంటనే అతను అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. దర్యాప్తు అధికారుల ప్రకారం, శ్రీనివాస్ నివాస ప్రాజెక్టుల కోసం ప్రీ-లాంచ్ పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించాడు. ఆపై మోసానికి పాల్పడ్డాడు. ఒకటా రెండా ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇళ్ల కొనుగోలుదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. అయితే, నిధులు సేకరించిన తర్వాత, వాగ్దానం చేసిన ఇళ్లను అందించడంలో విఫలమయ్యాడని, తద్వారా కొనుగోలుదారులను మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగింది ఈడీ. ఈ మేరకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల ద్వారా దాదాపు రూ. 300 కోట్లను పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. ఈ నిధులను హౌసింగ్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టకుండా, పక్కదారి పట్టించి దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
