హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వ హామీల అమలుకై 22 నుండి (21 నేటి అర్ధరాత్రి నుండి) చేపట్టనున్న సమ్మెకు తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సమైక్య పూర్తి మద్దతును తెలియ జేస్తుందని మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రేకులపల్లి శేషన్న లు తెలిపారు. ఈ సందర్భంగా కుషాయిగూడ డిపో వద్ద బాబు జగ్జీవన్ రావ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీని క్రమక్రమంగా నిర్వీర్యం చేసే విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కొత్త బస్సులను తీసుకు రాకుండా ప్రైవేటు బస్సులను ఆర్టీసీలో పెట్టుకొని తిప్పుతూ ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కార్మికులకు నష్టం చేసే చర్యలను చేపడుతున్నారని, వాటి ప్రయత్నాలను ఆపాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజా పాలన అంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలే తప్ప, ప్రైవేటీకరణకు, ఏజెన్సీలకు కట్టబెట్టే విధంగా ఉందని ఈ చర్యను వెంటనే మానుకోవాలన్నారు. తెలంగాణ ఆర్టీసీలో కార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంపై నిరసనగా చేపట్టిన సమ్మెకు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సమైక్య మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లూరి బాబు, రాష్ట్ర సెక్రెటరీ గౌడ రవి కిరణ్, సి హెచ్ నర్సింగ్ రావు, కుషాయిగూడ బస్సు డిపో జేఏసీ చైర్మన్ యుగంధర్ రెడ్డి ,ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, జేఏసీ నాయకులు ,మహిళలు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
