అమరావతి : తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షం వహిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పటి వరకు వెలిగొండ కారణంగా నిర్వాసితులైన రైతులకు రూ. 760 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం 4.47 లక్షల ఎకరాలకు సాగు, 23 లక్షల మందికి త్రాగు నీరందుతోందన్నారు . ఈనెల 31 న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని వెల్లడించారు. వెలిగొండ టన్నెల్స్ నుండి 10.5 టీఎంసీ ల కృష్ణా జలాలను, నల్లమల సాగర్ కు విడుదల చేస్తామన్నారు నిమ్మల రామానాయుడు. మూడు దాసల్లో 760 కోట్ల రూపాయలను 40 రోజుల్లో వెలిగొండ నిర్వాసితులకు ఇచ్చాం అన్నారు.
వెలిగొండ కు భూములు ఇచ్చిన త్యాగాధనులకు పరిహారం ఇచ్చాకే, నీళ్ళు వదలాలని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రం లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు 3 వేల కోట్లు ఇచ్చాం అని తెలిపారు నిమ్మల రామానాయుడు. వెలిగొండ లో అర్హత ఉన్న ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తాం అని స్పష్టం చేశారు. వెలిగొండ పనులు పూర్తవ్వకుండా నాడు జగన్ జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశాడని నిప్పులు చెరిగారు. 3 దశాబ్దాల కలను చంద్రబాబు నిజం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఎల్ నినో వంటి క్లిష్ట సమయం లో నల్లమల సాగర్ కు 10.5 టీఎంసీ ల కృష్ణా జలాలను తీసుకొస్తున్నాం అన్నారు. భవిష్యత్ లో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
















