హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2026-27 వానాకాలం (ఖరీఫ్) సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వానాకాలం సీజన్లో రాష్ట్రంలో సుమారు 57.7 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, సుమారు 119.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు సీఎస్ తెలిపారు. ఇందులో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. 2026-27 వానాకాల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సంజయ్ జాజు డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత వానాకాలం సీజన్లో సుమారు 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగి, 154.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సీఎస్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), ఇతర కొనుగోలు ఏజెన్సీల సమన్వయంతో కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం ప్రారంభమవుతుందని, నవంబర్లో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం రవాణా, హమాలీల ఏర్పాటు, గోదాములు, నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని సీఎస్ సూచించారు. రైతుల ఆధార్ వివరాలను చెల్లింపుల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసే ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని, రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డీ.ఎస్. చౌహాన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
















