హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను తెలంగాణ ప్రాంతం పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సంక్రాంతి కానుకగా రేవంత్ రెడ్డి గోదావరిని చంద్ర బాబు నాయుడుకు అప్పగించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ముందు నుంచి అనుకున్నట్టే గోదావరిని ఆంధ్రప్రదేశ్ కు కట్టబెడుతున్నారని ఆవేదన చెందారు. కోర్టులకు లాయర్లు వెళ్తారు, మంత్రులు వెళ్లడం ఏంటి అంటూ ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి . అసలు బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మంత్రులకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. శాసన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వాళ్ళు కోర్టుకు వెళ్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
అపర మేధావులు ముఖ్యమంత్రి , మంత్రులు అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి. చంద్ర బాబు నాయుడు డైరెక్షన్ లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని పేర్కొన్నారు. బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా సీఎంకు, మంత్రులకు సిగ్గు లేకుండా పోయిందన్నారు.
కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీశ్ రెడ్డి. రాబోయే రోజుల్లో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని క్షమించరని వార్నింగ్ ఇచ్చారు. చంద్ర బాబు నాయుడు కనుసన్నల్లో దుర్మార్గం జరుగుతుందని, కానీ ఆయన కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ చెల్లవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగదీశ్ రెడ్డి.















