చెన్నై : తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామా లేఖలను తిరస్కరించాలని స్పీకర్ ను కోరారు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు , విప్ ఎస్ఎస్ కృష్ణమూర్తి, రాజ్యసభ ఎంపీ ఐఎస్ ఇన్ బదురై. మంగళవారం ఈ ఇద్దరు నేతలు విడిగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. వినతిపత్రాన్ని సమర్పించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని వర్గం ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక చట్టపరమైన, విధాన పరమైన లోపాలు ఉన్నాయని ఆరోపించారు. వారి రాజీనామాలను ఆమోదించవద్దని కోరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు నోటిఫై కాకముందే వారు అధికార టీవీకే పార్టీలో చేరారని ఆరోపించారు.
కాగా ఇటీవల ప్రభుత్వ బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్న పార్టీ ఆదేశాలను ధిక్కరించిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాము గతంలో దాఖలు చేసిన పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉండగా, సంబంధిత శాసన సభ్యుల రాజీనామాలను ఆయన ఆమోదించలేరని కృష్ణమూర్తి అన్నారు. విశ్వాస తీర్మానంపై పళనిస్వామి ఆదేశాలను ధిక్కరించినందుకు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని తాము కోరామన్నారు. కాగా అది తన పరిశీలనలో ఉందని స్పీకర్ చెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటారన్న భయంతో, వారిలో ముగ్గురు రాజీనామాలు సమర్పించారని తెలిపారు
















