హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపునకు తాను పాల్పడ లేదన్నారు. అయితే తనకు పదవి అన్నది ముఖ్యం కాదన్నారు. తాను కొన్నేళ్లుగా ప్రజలతో ఉన్నానని, ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇదే సమయంలో కొందరు కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ప్రజలు కోరుకుంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు దానం నాగేందర్. తాను ఏనాడూ ఎన్నికలను చూసి వెనక్కి తగ్గ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు.
ఎప్పుడు పోటీ చేసినా తాను గెలవడం ఖాయమని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు దానం నాగేందర్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. వారు రాజకీయ మర్యాద పాటించడం లేదని పేర్కొన్నారు. సీఎంఓ కార్యాలయాన్ని ఉద్దేశించి వారు వాడిన భాష అభ్యంతరకరమని అన్నారు దానం నాగేందర్. ఏది ఏమైనా ఖైరతాబాద్ వేదికగా ప్రజా తీర్పు కోసం రాజీనామా చేస్తానని తెలిపారు. తన పార్టీ కార్యకర్తల అచంచలమైన మద్దతు వల్లే ఈ ధైర్యం వచ్చిందని, అందుకే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు .
