RBI : జన్ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్లు తెరిచిన ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సూచన జారీ చేసింది. ఈ ఖాతాలకు తప్పనిసరిగా రీ కేవైసీ (Re-KYC) చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు విధించినట్లు వెల్లడించింది.
ప్రభుత్వరంగ బ్యాంకులు గ్రామీణ, పంచాయతీ స్థాయిలో రీ కేవైసీ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ క్యాంపుల్లో రీ కేవైసీతోపాటు మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలు వంటి సేవలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.
RBI – రీ కేవైసీ అంటే ఏమిటి?
రీ కేవైసీ అనేది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, చిరునామా తదితరాలను బ్యాంకులో అప్డేట్ చేసే ప్రక్రియ. మీ కేవైసీ గడువు పూర్తయినా లేదా మీ చిరునామా, ఇతర వివరాలు మారినా బ్యాంకుకు తాజా సమాచారం అందించాల్సి ఉంటుంది. జన్ధన్ ఖాతాలు ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ రీ కేవైసీ ప్రక్రియ చేపట్టబడుతోంది.
ఆన్లైన్ సౌకర్యం:
ఆర్బీఐ ఖాతాదారుల సౌకర్యార్థం ఆన్లైన్లో కూడా రీ కేవైసీ పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది. ముఖ్యంగా అత్యధిక జన్ధన్ ఖాతాలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి రీ కేవైసీ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది.
జన్ధన్ ఖాతాల ఆవిర్భావం:
2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రధాన మంత్రి జన్ధన్ యోజన లక్ష్యం ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా కల్పించడం. ఈ పథకం ద్వారా ప్రజలు భద్రంగా తమ నగదును పొదుపు చేసుకోవడం, రుణాలు పొందడం, నగదు లేకుండానే ఖాతా నిర్వహించుకోవడం సులభతరం అయింది. ఇటీవల ఈ ఖాతాలకు చెక్కు సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
Also Read : Post Office Important Scheme : ₹1 లక్ష FDపై లాభం ఎంత? పోస్టాఫీసు స్కీమ్ వివరాలు


















