హైదరాబాద్ : పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం తమది అని, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన అప్పులు, పెండింగ్ బిల్లులు, ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పరిష్కరిస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణను సుమారు 3,475 రోజులు పాలించిన గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీగా అప్పుల భారాన్ని మోపి వెళ్లిందని ఆరోపించారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని ఎక్కడా కుంటు పడనివ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లిస్తూనే.. పెండింగ్లో పెట్టిన బిల్లులను చెల్లిస్తూ.. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ.. కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. గతం నుంచి వచ్చిన బాధ్యతలను నెరవేర్చడం ఒకవైపు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరోవైపు. రెండు కళ్లలా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో పెండింగ్లో పెట్టిన బిల్లులను పరిశీలించి, అర్హమైన, జెన్యూన్ బిల్లులను చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సర్పంచులు, కాంట్రాక్టర్లు, వివిధ అభివృద్ధి పనులు చేసిన వారికి గత పాలనలో పెండింగ్లో పెట్టిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు.
రైతును రాజును చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంటలకు ప్రోత్సాహకాలు తదితర కార్యక్రమాలను కలిపి గత 1,000 రోజుల్లో సుమారు ₹1.76 లక్షల కోట్లను రైతు సంక్షేమానికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు ₹500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. ఒక్క వరి పంటకే కాకుండా ప్రతి పంటకు రైతుకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘నీళ్లు–నిధులు–నియామకాలు’ అని చెప్పిన గత పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను నిరాశ పరిచారని మంత్రి విమర్శించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలతో వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే ప్రక్రియను పునరుద్ధరించిందన్నారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని, ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పేద పిల్లలు కూడా ధనిక పిల్లలతో సమానంగా పోటీ పడేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడంతో పాటు పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు.పేద పిల్లల చదువును ఖర్చుగా కాదు.. భవిష్యత్తుపై పెట్టుబడిగా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం ₹5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. నాలుగు విడతల్లో చెల్లింపులు జరుగుతున్నాయని, చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. కులం, మతం, పార్టీ, రాజకీయ అనుబంధం చూడకుండా కేవలం అర్హత ఆధారంగానే పేదలకు ఇళ్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్లో ఇల్లు, ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు వారి జీవనోపాధికి దూరంగా కాకుండా, వారు నివసిస్తున్న నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఎకరం ₹100 కోట్లు, ₹200 కోట్లు, ₹300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లో కూడా పేదవాడి ఇల్లు ఉండాలి. పేదవాడు తలెత్తుకుని గౌరవంగా జీవించాలని అన్నారు. ఈ లక్ష్యంతో హైదరాబాద్ పరిధిలో 20 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని, మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల గుర్తింపు, టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అదనంగా 20 శాతం ఇళ్లను కలుపుకుని మొత్తం సుమారు 600 ఇళ్లను ప్రణాళికలో ఉంచామని చెప్పారు. బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్, ఇతర మౌలిక వసతులతో ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ టవర్స్లో లక్కీ డ్రా ద్వారా ఎంపికయ్యే అర్హులైన మహిళల పేరుతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో, భూమిలో అన్డివైడెడ్ షేర్తో కూడిన ఇంటిని లబ్ధిదారురాలి పేరుతో రిజిస్టర్ చేస్తామని తెలిపారు. ఆడబిడ్డ పేరుతో ఇల్లు.. ఆమెకు ఆస్తి హక్కు, ఆమె కుటుంబానికి భద్రత.. ఇదే ఇందిరమ్మ టవర్స్ ఉద్దేశం అని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలు, డబ్బు, రాజకీయ సిఫారసులకు అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. లక్కీ డ్రాలో పేరు వచ్చిన తర్వాత అధికారులు లబ్ధిదారుల నివాస పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని, అర్హత నిర్ధారణ అనంతరం తుది ధ్రువీకరణ చేస్తారని చెప్పారు. డబ్బు ఇచ్చినా.. పైరవీ చేసినా.. రాజకీయంగా ఒత్తిడి తెచ్చినా ఇల్లు రాదు. అర్హత ఉన్నవారికే ఇల్లు అని మంత్రి తేల్చి చెప్పారు.
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. మొదటి దశను పైలట్గా అమలు చేసి, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్లో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి, వారు నివసించే ప్రాంతానికి దగ్గరలోనే గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

















