ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ ను, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను ఏకి పారేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. ఏకసామ్యంగా మార్చేశారని, ప్రస్తుతం భారత రాజ్యాంగంపై మీ కన్ను పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రబ్బర్ స్టాంపుగా మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తాను పూర్తి ఆధారాలతో సహా ఓట్ల చోరీ జరిగిందని దేశం సాక్షిగా చెప్పానని, కానీ దానిని పరిగణలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ముమ్మాటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షా, మోదీపైనే ఉందన్నారు.
పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఆయన మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇది పూర్తిగా రక్షణాత్మక ప్రతిస్పందన. పారదర్శక ఓటర్ల జాబితా ఇవ్వాలని నేను చెప్పాను, కానీ ఆయన దీనికి సమాధానం ఇవ్వలేదు. EVM నిర్మాణాన్ని అందరికీ అందించాలని నేను చెప్పాను, కానీ ఆయన దాని గురించి ఏమీ అనలేదు. హర్యానా , బీహార్లో బిజెపి నాయకులు ఓటు వేస్తున్నారని నేను చెప్పాను, కానీ ఆయన దాని గురించి ఏమీ అనలేదంటూ ఎద్దేవా చేశారు.
















