హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. పార్టీలు మారిన చరిత్ర తనదన్నారు. పూటకో మాట మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది ఆయనకు తగదన్నారు. ఇదే సమయంలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆనాడు రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ ను, మాజీ సీఎంను అనరాని మాటలు అన్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తానేమీ అబద్దం చెప్పడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బోలెడన్ని ప్రస్తుతం యూట్యూబ్ లో లభ్యం అవుతాయని పేర్కొన్నారు.
ఎవరిని మభ్య పెట్టడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రఘునందన్ రావు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్పీ కంటే ఆ ఊసరవెల్లి అత్యంత నయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆనాడు బ్లూ కలర్ కండువా వేసుకొని ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని, కేసీఆర్, కేటీఆర్ చేశారని ఆరోపించిన ఆర్ఎస్పీ అప్పుడే మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. పింక్ కలర్ లోకి మారగానే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పడం దారుణమన్నారు ఎంపీ. పార్టీలు మారడం, నీకు ఏది తోస్తే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు. కేసీఆర్ పక్కన చేరగానే సత్య హరిశ్చంద్రుడంటూ కితాబు ఇవ్వడంపై మండిపడ్డారు.

















