అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా కీలక సూచనలు చేశారు. ఆయన వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు అందించే ప్రజా సేవలను మరింత మెరుగు పరచాలని స్పష్టం చేశారు. దీని వల్ల పాలనా పరంగా ఇబ్బందులు తొలగి పోయేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మరింత నిబద్దతతో, పారదర్శకంగా విధులు నిర్వహించినట్లయితే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. అంతే కాకుండా ఏపీ కూటమి సర్కార్ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కింది స్థాయి వరకు ఈ పథకాలను , కార్యక్రమాలను చేరవేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు మరింత ఫోకస్ సారించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా ఈ రోజు క్యాంప్ సీఎం కార్యాలయంలో ‘రియల్-టైమ్ గవర్నెన్స్’పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ-అల్లూరి విమానాశ్రయ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలలో కనిపించిన విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఇతర రంగాలకు కూడా విస్తరించాలని ఆయన సూచించారు. మహిళలపై నేరాలు , గంజాయి నియంత్రణ వంటి అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ప్రజా పాలన అందిస్తోందని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#ఆంధ్రప్రదేశ్
