అమరావతి : ఏపీలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సిఈలు, ఎస్ఈలతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా టెలీ కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహ మూర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు నిమ్మల రామానాయుడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాల కోసం వినియోగిస్తున్నాం అని ప్రకటించారు.
పుష్కర కాలువ , ఏలేరు వ్యవస్ధ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు, ఆరుతడి పంటలకే వినియోగించాలని స్పష్టం చేశారు. లేక పోతే తాగు నీటికి, సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్ధ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో సుమారు 55 లక్షలు మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని అన్నారు నిమ్మల రామానాయుడు. గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు సాగు కొనసాగించేందుకు అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు .డెల్టా లో మెరక ప్రాంత రైతులు ఆరుతుడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ పద్దతిలో వినియోగించు కోవాలని, అంతే కాకుండా ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు . గోదావరి సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టాల ప్రాధాన కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా వీడ్ తొలగించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంట పూర్తయ్యే వరకు ఓఅండ్ఎం పనులు కొనసాగిస్తూ, రైతులు, సాగునీటి సంఘాల సహకారంతో ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని దుర్వినియోగం కాకుండా, కృష్ణా డెల్టాకు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు నిమ్మల రామానాయుడు.
గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 10 జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ లు నిర్వహించి ప్రస్తుత పరిస్దితులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్ నినో క్లిష్ట సమయంలో ఇరిగేషన్ శాఖ ల పైస్దాయి నుండి కింది స్దాయి వరకు అధికారులు అందరూ అందుబాటులో ఉండేలా శెలవులు రద్దు చేస్తున్నాం అన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు నీళ్ళు నిండకుండా, వరిసాగు చేస్తే భవిష్యత్ లో పంట మొత్తం నష్టపోతుందని హెచ్చరించారు. పట్టిసీమ నుండి వచ్చేనీటిని కేవలం తాగు నీటి అవసరాలకు, ఆరుతడి పంటలకు మాత్రమే వినియోగించాలని కోరారు. .
















