హైదరాబాద్ : ‘అఖండ-2’ మూవీ వివాదం తనను కలచి వేసిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2- తాండవం’ సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదం పై కీల వ్యాఖ్యలు చేశారు. సినిమాలను చివరి నిమిషంలో అడ్డుకోవడం పరిశ్రమకు ఎంతో నష్టం చేస్తుందని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని అన్నారు. విడుదలకు ముందు సినిమాలను ఆపి వేయడం చాలా దురదృష్టకరం. దీని ప్రభావం పరిశ్రమలోని ఎంతో మందిపై పడుతుందని అన్నారు. నటీనటులు, పెద్ద సినిమాలతో పాటు తమ చిత్రాలను విడుదల చేయాలనుకునే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారంటూ వాపోయారు.
చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణం. సినిమాకు సమగ్రత కావాలి కానీ, జోక్యం కాదన్నారు టీజీ విశ్వ ప్రసాద్. ఇలాంటి చర్యల వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, టెక్నీషియన్లు సహా వేలాది మంది ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠినమైన, చట్ట పరమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభాస్తో నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన పెట్టుబడులన్నీ అంతర్గత నిధుల ద్వారా పూర్తిగా చెల్లించామని, మిగిలిన చిన్న మొత్తాలను కూడా త్వరలోనే సెటిల్ చేస్తామని విశ్వప్రసాద్ స్పష్టం చేశారు.



















