అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో పర్యాటక, ఎకో రంగాలపై బుధవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని వనరులు ఏపీలో ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు, విశిష్టత కలిగిన చరిత్ర ఇంకెక్కడా లేదని ఆ విషయం గుర్తు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు సీఎం. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. (SIPB)లో అమోదం తెలిపిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. అటవీ, దేవాదాయశాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. ప్రశాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధి ప్రాజెక్టులు 2026 మే నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. గోదావరి పుష్కరఘాట్తో పాటు హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు ఎప్పటికప్పుడు పూర్తి కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం.


















