హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తన్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బాయ్ కాట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు జగదీశ్ రెడ్డి. ఎక్కడైనా ప్రపంచంలో అధికార పక్షాన్ని ప్రశంసలు కురిపించడం, బాగుందంటూ చెప్పడం ప్రతిపక్షం పని కాదని స్పష్టం చేశారు . సీఎంను విమర్శించక పోతే ప్రతిపక్షం ఎక్కడన్నా ముఖ్యమంత్రికి డబ్బా కొడుతుందా అని నిలదీశారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వక పోవడం ఏంది అంటూ స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి మూసీ కంపును అంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధానమైన ప్రతిపక్షంగా తాము ప్రజల తరుపున ప్రశ్నలు అడగడం తమ విధి అని చెప్పారు. మూసే పునరుద్దరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. నిరాశ్రయులైన వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించక పోవడం దారుణమన్నారు జగదీశ్ రెడ్డి. ప్రజల ఇల్లు కూల కొడితే వాళ్ల వెంట ఉంటామని చెబితే, ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు దాడి చేసి మాకు అవకాశం ఇవ్వకుండా వేరే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి మూసీ ప్రస్తావన తీసుకు రాగానే వారు మాట్లాడకుండా మైకులు కట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
