అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం. ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో పర్యటించింది. పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి ఘన స్వాగతం పలికారు రాష్ట్ర జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈఐఎల్ఎఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా పీపీఏ సిఈఓతో పాటు పోలవరం లో పర్యటిస్తున్న అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె శంకర్ కూడా పాల్గొన్నారు. ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కేంద్ర నీటి పారుదల, జల శక్తి, ఆర్తిక శాఖ మంత్రులకు విన్నవించారు. వినతి పత్రాలను సమర్పించారు. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

















