బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్కు, బీసీసీఐకి మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దడంపై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ వ్యవహారాలు మెరుగు పడతాయని ఆయన అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్ను తమ 2026 జట్టు నుండి తొలగించింది.
ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో తీవ్ర కలకలం రేపింది, దీని ఫలితంగా భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ నుండి ఆ జట్టు వైదొలిగింది . తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది. అయితే, భారత్లో తమ జట్టుకు ఎలాంటి నమ్మదగిన ముప్పు లేదని పేర్కొంటూ ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. తదనంతరం, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేశారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగాయి. కొత్త సర్కార్ ఏర్పడింది. దీనిపై స్పందించారు షకీబ్ అల్ హసన్. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పరిస్థితులు మెరుగు పడటం ప్రారంభిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తను ఈయూటీ20 బెల్జియం జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.



















