హైదరాబాద్ : కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రానికి రావాల్సిన నిధుల ను మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పటేల్ లు నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. ఇదేనా ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ది అని అన్నారు. కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదన్నారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని లక్ష్యాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్ పై ఉందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించు కుంటుందని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రాల మీద భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ఇది ఎంతమాత్రం సరి కాదన్నారు. కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్రం వాటా 90% ఉండే విధంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు గత పదిహేనేళ్లుగా నామమాత్రంగా ఇస్తున్నది కేంద్రం అంటూ భగ్గుమన్నారు. ఆయా మొత్తాలను పెంచాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
