హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాల్టితో పంచాయతీ సమరం ముగుస్తుంది. ఇప్పటి వరకు మూడు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించింది. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 13న జరిగాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు టాప్ లో ఉండగా 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. ఇక 3వ ప్లేస్ లో సరి పెట్టుకుంది బీజేపీ. ఇక నేడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కింపు చేపడతారు. సర్పంచ్ లతో పాటు వార్డు సభ్యులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 3,752 గ్రామ పంచాయతీలు , 28,400 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎన్నికల బరిలో 12,652 మంది సర్పంచ్ పదవుల కోసం బరిలో అభ్యర్థులు ఉండగా 75,725 మంది వార్డు పదవుల కోసం పోటీ లో ఉన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించగా బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. ఇక రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏకంగా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల స్వంత ఊర్లలో జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు.
