భారీ విస్ఫోటనం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దిగ్భ్రాంతికరం

బాధితుల‌ను ఆదుకుంటామ‌ని డిప్యూటీ సీఎం ప్ర‌క‌ట‌న‌

hellotelugu-PawanKalyan

అమ‌రావ‌తి : కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ దురదృష్టకర ఘటన గురించి తెలియగానే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నార‌ని అన్నారు. అంతే కాకుండా క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించే ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .

బాణాసంచా తయారీ పరిశ్రమ నుంచి ఇంకా పేలుళ్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలపై విచారణ చేస్తున్నారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించామ‌న్నారు ప‌వ‌న్ కళ్యాణ్. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశానని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేప‌ట్టాల‌ని, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని దిశానిర్దేశం చేశాన‌ని తెలిపారు.

Exit mobile version