Pawan Kalyan : అమరావతి : తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందని చెప్పారు. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పన పైనా దృష్టి సారించామని అన్నారు. విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మత్స్య శాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు . కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్ట బోతున్నామని తెలిపారు పవన్ కల్యాణ్.
DY CM Pawan Kalyan Focus on
100 రోజుల ప్రణాళక అమలులో భాగంగా మత్స్య సంపద పెంపొందించడం, వేట నైపుణ్యాన్ని పెంచడం, ప్రత్యేక రీఫ్ ల ఏర్పాటు, ప్రత్యామ్నయ ఆదాయ వనరుల సృష్టి తదితర అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు పవన్ కల్యాణ్. సంప్రదాయ వేట ఆధారంగా జీవనం సాగించే మత్స్యకార సోదరులు కాకినాడలో జరిగిన సమావేశంలో మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలియ చేశారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంపొందించే చర్యల్లో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాల్లో 50 వేల పండుగప్ప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామన్నారు.
Also Read : CM Siddaramaiah Fired on Union Govt : మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం : సీఎం
