అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దిపై ప‌వ‌న్ ఫోక‌స్

కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

hellotelugu-MaandaliBudhaPrasad

అవనిగడ్డ : అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన వన్ టూ వన్ సమావేశంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, జరగవలసిన పనులు గురించి చర్చించారని తెలిపారు. ఇప్పటికే అవుట్ ఫాల్ స్లూయీజుల నిర్మాణం, ఎదురు మొండి ఏటిమొగ బ్రిడ్జి విషయంలో నిధులు సమకూర్చడం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదించినట్లు చెప్పారు. డిసెంబర్లో నిధులు విడుదలకు వారు ప్రయత్నం చేస్తున్నారని బుద్ధప్రసాద్ తెలిపారు.

పంచాయతీరాజ్ రోడ్లకు రూ.16 కోట్లు మంజూరు చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్న మరి కొన్ని రహదారుల పరిస్థితి వారి దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే మరిన్ని రహదారులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారని చెప్పారు. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించగా నియోజకవర్గంలో పరిశ్రమలు లేవని, ఉన్న ఒక్క చక్కెర కర్మాగారం మూత పడిందని, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని తెలియ చేశామ‌న్నారు. జిల్లా కలెక్టర్లను ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించార‌ని అన్నారు.

నియోజకవర్గంలో సాగర సంగమం అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. దివిసీమలో ఉన్న చారిత్రక పుణ్యక్షేత్రాలను టెంపుల్ టూరిజంలో చేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వెల్ల‌డించారు మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్. అంతే కాకుండా తెలుగు భాషకు భావితరాలు దూరమవుతున్నాయని, తెలుగు బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దీనిపై ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దాం అని డిప్యూటీ సీఎం చెప్పారని పేర్కొన్నారు.

Exit mobile version