తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీన పత్ర పుష్ప యాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ముందు రోజు ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుందని వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ). మే 1న ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, మహా పూర్ణాహుతి, కలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరకు రసం, కొబ్బరి నీరు, విభూతి, పసుపు, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, కనకాంబరం వంటి పుష్పాలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్పయాగం నిర్వహించ నున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామి, మన్మోహిని అమ్మవార్ల తిరువీధి ఉత్సవం భక్తులను అలరించనుంది. లోక క్షేమం కోసమే కాకుండా ఆలయంలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల జరిగిన లోపాల నివారణార్థం పత్ర పుష్ప యాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.
