హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలలు విధించిన అధిక ఫీజులు, అదనపు ఛార్జీలకు వ్యతిరేకంగా హైదరాబాద్ వ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర నిరసనలు చేపట్టారు. పాఠశాల యాజమాన్యాలు తమపై ఆర్థిక భారం మోపుతున్నాయని, పారదర్శకత లోపించిందని వారు ఆరోపించారు. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద పెరిగిన ఫీజులపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల ముందు గుమిగూడి నిరసన తెలిపారు. నిన్న ఓల్డ్ సిటీ, కూకట్పల్లిలోని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇలాంటి ఆందోళనలే జరిపారు. అక్కడ తల్లిదండ్రులు ఏకపక్ష ఫీజుల పెంపు, అదనపు ఛార్జీలపై నిరసన వ్యక్తం చేశారు.
రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పిఎస్)లో అత్యంత తీవ్రమైన నిరసన కనిపించింది. వందలాది మంది తల్లిదండ్రులు ఈ ఫీజుల పెంపును “అతిగా, ఏకపక్షంగా” ఉందని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల కమిటీ ప్రకారం, గత నాలుగేళ్లలో పాఠశాల ఫీజులు దాదాపు 141% పెరిగాయి. 2021లో సుమారు రూ. 83,630గా ఉన్న ఫీజులు 2025 నాటికి రూ. 2,01,628కి పైగా చేరాయి. సుదీర్ఘ చర్చల తర్వాత కూడా ఎటువంటి పరిష్కారం లభించక పోవడంతో విసిగి పోయిన తల్లిదండ్రులు, రాబోయే ఐదేళ్లపాటు ప్రస్తుత ఫీజుల విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఇకపై ఫీజులు పెంచబోమని పాఠశాల యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు మొదటి టర్మ్ ఫీజు చెల్లింపులను నిలిపి వేయాలని కూడా వారు సమిష్టిగా నిర్ణయించుకున్నారు.
హెచ్పీఎస్ బేగంపేట్ బ్రాంచ్కు చెందిన తల్లిదండ్రులు కూడా తమ మద్దతును ప్రకటించడంతో, రెండు బ్రాంచ్లు కలిసి యాజమాన్యానికి వ్యతిరేకంగా “ఫీజు సమ్మె”ను ప్రకటించాయి. ఫీజు సంబంధిత సమస్యలతో పాటు, పడిపోతున్న విద్యా ప్రమాణాలు, ఆహారం, క్రీడా మౌలిక సదుపాయాల వంటి సౌకర్యాల నాణ్యత క్షీణించడం, ఆర్థిక విషయాల్లో పారదర్శకత లోపించడం వంటి అనేక ఆందోళనలను తల్లిదండ్రులు ప్రస్తావించారు. ఆడిట్ చేసిన ఖాతాలను పంచుకోవడంలో గానీ, ఫీజుల భారీ పెంపునకు సరైన కారణాలు చూపడంలో గానీ పాఠశాల యాజమాన్యం విఫలమైందని వారు ఆరోపించారు.
నిరసన చేస్తున్న తల్లిదండ్రులు, చట్టబద్ధంగా తప్పనిసరి అయిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సంఘం (PTA)ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ప్రిన్సిపాల్ను తొలగించాలని కూడా పిలుపునిచ్చారు.ప్రభుత్వం జోక్యం చేసుకుని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.
