అమరావతి : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కు సంబంధించి వెస్ట్రన్ గ్రిడ్ కు, ఇండియన్ గ్రిడ్ కు చాలా తేడా ఉందన్నారు అసెంబ్లీలో. మన వద్ద వన్ నేషన్ – వన్ గ్రిడ్ వ్యవస్థను నరేంద్రమోదీ నాయకత్వంలో తెచ్చారన్నారు. దీనివల్ల రాయలసీమలో తయారుచేసే రెన్యువబుల్ ఎనర్జీ నార్త్ ఇండియాకు కూడా పంపించే అవకాశం ఉందని తెలిపారు. డేటా సెంటర్లు కనీసం 70శాతం గ్రీన్ ఎనర్జీ వాడాలని స్పష్టంగా చెప్పాం అన్నారు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ నే వినియోగించాలని సూచించచామని తెలిపారు మంత్రి. ఎక్కడా లేనివిధంగా మంత్రి గొట్టిపాటి నాయకత్వంలో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సు కూడా ఇచ్చామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఎలాంటి పెంపుదల ఉండదని ప్రకటించారు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని గుర్తు చేశారు.
ఈ ఏడాది 13పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదన్నారు. ప్రత్యేకించి ఒక సంస్థ 100 ఎంఎల్ డి డిశాలినేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తోందన్నారు. 1 గిగావాట్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు డేటా సెంటర్ ఉపయోగించే నీటి కంటే పదిరెట్లు ఎక్కువగా వినియోగిస్తుందన్నారు. విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లపై ధర్నా చేస్తున్న వారు ఏనాడు ధర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎనర్జీ కావాలి, డేటా సెంటర్ వద్దనడం ఎలా సబబు? ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎఐ అనివార్యం. అది మన జీవితం భాగమైంది. గూగుల్ పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం వల్లే మిగిలిన గ్లోబల్ సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లకు భూములు కేటాయించాలని అడుగుతున్నాయని చెప్పారు.
















