తిరుపతి : శ్రీకృష్ణ దేవరాయుల రాజనీతిని తన పాలనలో ఆచరణలో పెట్టిన మహానేత డా. నందమూరి తారక రామారావు అని హెచ్డిపిపి సెక్రటరీ డా. మేడసాని మోహన్ కొనియాడారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టిటిడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మేడసాని మోహన్ మాట్లాడారు. ఆముక్త మాల్యద లోని రాజధర్మ సారాన్ని ఎన్టీఆర్ తన పాలనలో అమలు చేశారని కొనియాడారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, నిస్వార్థ పాలన అందించిన దూరదృష్టి నాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. తెలుగు సాహిత్యకారులు, కళాకారులను ఆయన విశేషంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ దైవ పాత్రలను పోషించే ముందు ఎన్టీఆర్ ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యేవారని, అన్నారు. అదే ఆయన నటనా వైశిష్ట్యమని వివరించారు. నాటకాలలో దైవత్వ పాత్రలు పోషించే కళాకారులు అదే పందాను అనుసరించారన్నారు. పద్మశ్రీ శోభారాజ్ మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్బండ్పై అన్నమయ్య విగ్రహ స్థాపనకు ఎన్టీఆర్ వెంటనే స్పందించి ఆ కలను సాకారం చేశారని గుర్తు చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో( సంక్షేమం) ఎ. ఆనందరాజు, శ్వేతా ఇంఛార్జీ ఢైరెక్టర్ సువర్ణమ్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. లత తదితరులు పాల్గొన్నారు. టిటిడికి చెందిన పలు సంఘాల నేతలు, పలువురు అధికారులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల తెలుగు విబాగాధిపతి డా. కృష్ణవేణి వ్యవహరించారు.
