అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది గురించి ఖుష్ కబర్ చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో ఏపీకి జాతీయ గుర్తింపు లభించిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ ‘నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్-2025’ విభాగాల్లో రాష్ట్రం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను , పురస్కారాలు గెలుచుకున్న గ్రామ పంచాయతీలను అభినందించారు.
గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఈ రెండు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్వితీయ స్థానాన్ని సాధించడం ఎంతో గర్వించ దగిన అంశమని అన్నారు సీఎం. పంచాయతీ రాజ్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తూ, ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న శృంగవరం, బొక్కసంపాలెం, చెముల్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు కూడా ఆయన తన అభినందనలు తెలియజేశారు. ఈ ఘనత సాధనలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరునా ప్రశంసలు కురిపించారు.















