రేపే ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేష్ శంకుస్థాపన

హెల్త్ కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్ ఏర్పాటు

hellotelugu-AIGHospitals

అమరావతి: ప్రజాప్రభుత్వ పాలనలో విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది. విశాఖలో ప్రపంచ స్థాయి మౌలిక మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో ఏఐజీ హాస్పటల్స్ నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఆసుపత్రి ఏర్పాటు ద్వారా ఏపీ వాసులు ఇకపై హైదరాబాద్ వెళ్లే పని లేకుండానే మెరుగైన వైద్యం రాష్ట్రంలోనే అందుబాటులోకి రానుంది. విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశల వారీగా ఐదేళ్లలో 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది.

ఓపీడీ సేవలు రోజుకు 5 వేలు ఉండనున్నాయి. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన ఏఐజీ హాస్పిటల్స్.. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ను నెలకొల్పనుంది. మొదటి దశలో టవర్-ఏ, టవర్-బి నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. రెండో దశలో టవర్-సి నిర్మాణాన్ని 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. ఔట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు సుమారు 5 వేల మంది రోగులకు సంప్రదింపులు అందించే విధంగా రూపొందించారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తి స్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. ప్రత్యేక మాతా శిశు విభాగం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా కేటాయించిన 2.5 ఎకరాల ప్రాంగణంలో నర్సింగ్ కళాశాల, నర్సింగ్ సిబ్బంది కోసం హాస్టల్‌ నిర్మించనున్నారు. అనుబంధ ఆరోగ్య సేవలు, సాంకేతిక సిబ్బందికి పారా మెడిక్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పనున్నారు. నిరంతర విద్యా కార్యకలాపాల కోసం 500 సీట్ల ఆడిటోరియం నిర్మించనున్నారు. క్లినికల్ వ్యవస్థలోనే రీసెర్చ్ ల్యాబ్, AI సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విజిటింగ్ ఫ్యాకల్టీ, డాక్టర్స్ కోసం వసతి, రోగుల సహాయకులు, బంధువుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన వసతి కల్పిస్తారు. ఆసుపత్రి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వెయ్యి మంది వైద్యులు సేవలందించనున్నారు.

వైద్య రంగంలో ఏఐజీ హాస్పిటల్స్ కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. హైదరాబాద్‌లో 3 యూనిట్లు, 1,400కు పైగా పడకలు, 350కు పైగా ICU పడకలు, 600కు పైగా వైద్యులు, హెల్త్ కేర్ నిపుణులు ఉన్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ యూనిట్‌కు ఏఐజీ హాస్పిటల్స్ నిలయంగా ఉంది.

Exit mobile version