బుసాన్ (సౌత్ కొరియా): పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ సీఈవో, ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్ , బిజినెస్ స్ట్రాటజీ , ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కీలక అంశాలపై వారితో చర్చించారు. అనంరతం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూ యంగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ కి వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని అన్నారు నారా లోకేష్. బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బూ యంగ్ పాదరక్షల తయారీ, విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. స్కైకార్ప్ గ్రూప్ అంతర్భాగంగా ఉన్న తమ సంస్థ అంతర్జాతీయ నెట్ వర్క్ తోపాటు 4,300 గ్లోబల్ కస్టమర్లు, 1.10 లక్షలకుపైగా అంతర్జాతీయ షిప్ మెంట్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. తమకున్న గ్లోబల్ నెట్ వర్క్ భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని స్పష్టం చేశారు.
















