తమిళనాడు : పళని మురుగన్ ఆలయం రూ. 103 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఆలయ చరిత్రకు సంబంధించి ఈ ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన పళనిలోని దండాయుధపాణి ఆలయం, తన చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. జూలై 1, 2025 నుండి జూన్ 30, 2026 వరకు ఉన్న కాలంలో ఆలయ ఆదాయం రూ. 100 కోట్లు దాటిందని ఆలయ యంత్రాంగం తెలిపింది. ఆలయం మొత్తం రూ. 103.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పోల్చి చూస్తే, అంతకు ముందు ఏడాది ఆదాయం రూ. 97.32 కోట్లుగా ఉంది. దానికి ముందు రెండేళ్లలో ఆదాయం వరుసగా రూ. 86.06 కోట్లు , రూ. 80.62 కోట్లుగా నమోదైంది.
సగటున ప్రతి సంవత్సరం సుమారు 1.20 కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ యంత్రాంగం ఉచిత అన్నదానం, ఉచిత తలనీలాల సమర్పణ, ప్రసాద వితరణ , ఆలయ నిర్వహణలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజన పథకాలతో సహా అనేక సంక్షేమ సేవలను అందిస్తోంది. గత ఐదేళ్లలో సుమారు రూ. 140 కోట్ల విలువైన ఉచిత సేవలను ఆలయం అందించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఈ ఏడాది ఆలయ ప్రసిద్ధ ‘పంచామృతం’ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆలయ యంత్రాంగం పేర్కొంది. 1435 ఆదాయ సంవత్సరంలో, భక్తులు రూ. 63.16 కోట్ల విలువైన పంచామృతాన్ని కొనుగోలు చేశారు.
ఇదిలా ఉండగా తమిళనాడులోని పళని పట్టణంలో ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) ఆలయాలలో ఒకటి. ఇది మురుగన్ స్వామికి సంబంధించిన ఆరు పవిత్ర క్షేత్రాలలో (ఆరుపడైవీడు) మూడవదిగా భావించ బడుతోంది. ఆలయంలోని విగ్రహాన్ని సిద్ధుడు భోగర్ నవపాషాణంతో రూపొందించారని సంప్రదాయం చెబుతుంది. ఈ ఆలయ ప్రసాదమైన పంచామృతం ఎంతో ప్రసిద్ధి చెందింది.
