హైదరాబాద్ : రాష్ట్రం లోని ప్రతీ నియోజవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఈఎంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జూబ్లీ హిల్స్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వి (WE) హబ్ నిర్వహించిన WE-Enable గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు శ్రీధర్ బాబు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. పెరుగుతున్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉన్న దార్శనికతతో, మహిళలు రాష్ట్ర పురోగతికి కీలక చోదకులుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు.
WE హబ్ 2.0 ప్రారంభ నైపుణ్యాలు, సాంకేతికత, ఆర్థికం, మార్కెట్లను ఒకే చట్రం కిందకు తీసుకురావడం ద్వారా మహిళలు నేతృత్వంలోని సంస్థలకు బలమైన పర్యావరణ వ్యవస్థను సూచిస్తుందన్నారు శ్రీధర్ బాబు. జ్వాలా గుత్తా , శ్రీ ప్రియాంక దత్ , సీతా పల్లచోళ్ల వంటి నాయకుల ఉనికి తెలంగాణలో మహిళలు నాయకత్వం వహించడానికి, ఆవిష్కరణలు చేయడానికి , ఇతరులకు అవకాశాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారనే సందేశాన్ని బలోపేతం చేసిందన్నారు మంత్రి. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను రుణ ప్రాతిపదికన ఇప్పించడం జరిగిందని చెప్పారు. దీని ద్వారా నెలకు రూ. 69 వేలకు పైగా వస్తాయన్నారు.















