Minister Savitha : అమరావతి : రాష్ట్ర ప్రజలకు ఆప్కో శుభవార్త చెప్పింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో చేనేత వస్త్రాలను డిస్కౌంట్ పై విక్రయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Minister Savitha Key Update
డిస్కౌంట్ లో అమ్మకాలతో అటు ప్రజలకు చేనేత వస్త్రాలను మరింత చేరువ చేసే అవకాశం కలుగుతోందని చెప్పారు. అదే సమయంలో చేనేత వస్త్రాల విక్రయాల పెరుగుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసాతో కూడిన ఉపాధి లభిస్తోందని తెలిపారు. 40 శాతం డిస్కౌంట్ కు ఆప్కో షో రూమ్ ల ద్వారా చేనేత వస్త్రాలను విక్రయించడం వల్ల అమ్మకాలు సైతం పెరిగినట్లు మంత్రి సవిత వెల్లడించారు. డిస్కౌంట్ ఇవ్వడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో షో రూమ్ ల ద్వారా రోజుకు సరాసరి రూ.3 లక్షల చొప్పున విక్రయాలు జరిగేవని పేర్కొన్నారు. 40 శాతం డిస్కౌంట్ తో అమ్మకాలు ప్రారంభించిన తరవాత రోజువారీ అమ్మకాలు రూ.9 లక్షలకు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. డిస్కౌంట్ విక్రయాలతో పాటు చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.
Also Read : Aswa Vahana Seva Interesting Update : కల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు
