అనంతపురం జిల్లా : సంక్రాంతి పండగ సందర్భంగా సందడి చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. తన కుటుంబీకులతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పండుగ సందర్బంగా నైనా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బుద్ది రావాలని, మారుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సంక్రాంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వందలాది మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మహిళలు అందమైన రంగవల్లులను అలంకరించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు అకట్టుకున్నాయి. ఎద్దుల బండ్ల పోటీలు, ఇతర క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహం పాల్గొన్నారు.
మంత్రి సవిత క్రీడాకారులను ప్రోత్సహించారు. ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న శ్రీదేవికి రూ.10 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన పద్మావతికి రూ.5 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన అనసూయకు రూ.5 వేలు అందజేశారు. ఇద్దరికి కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా బహుమానాలు అందజేశారు. క్రీడలతో పాటు కోలాటం, చెక్కల భజన, గోరెవయ్యాల నాట్యం, పొట్టేళ్ల పందాలు, గాలిపటం ఎగర వేయడం, డోలు ప్రదర్శన వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి . ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు,అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
