హైదరాబాద్ : ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నూతనంగా విద్యుత్ తో నడిచే బస్సులను తీసుకు వచ్చామని చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. బుధవారం కొత్తగా 65 బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇవన్నీ ఇవాల్టి నుంచి కొత్త బస్సులు రోడ్లపైకి రయ్ మంటూ తిరుగుతాయని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను ఆధునిక, శుభ్రమైన, నమ్మదగిన ఎలక్ట్రిక్ ఫ్లీట్తో బలోపేతం చేసే దిశగా ఈ ఇండక్షన్ ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని అన్నారు. 500 లో-ఫ్లోర్ సిటీ బస్ ప్రాజెక్ట్ కింద రాణిగంజ్ డిపో నుండి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిందని చెప్పారు మంత్రి.
ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని నిర్వహిస్తుందని తెలిపారు. రాణిగంజ్ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నామని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఇందులో భాగంగా కొత్తగా 65 బస్సులు తీసుకు వచ్చామన్నారు. మరికొన్ని మిగిలి పోయిన 35 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఐదు కీలక కేంద్రాలలో ఒకటిగా చింతల్, మియాపూర్ , హెచ్ సీ యూ, హయత్ నగర్ డిపోలలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తామని స్పష్టం చేశారు మంత్రి. 500 బస్సులలో 450 నాన్ ఏసీ , 50 ఏసీలో బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 325 బస్సులు డెలివరీ చేశామన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
















