హైదరాబాద్ : బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తమ సర్కార్ పై చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమవారం గాంధీ భవన్ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కండలు కరిగి పోయాయని, కేవలం చర్మం మాత్రమే మిగిలిందంటూ ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పునరాగమన వాదనలను జూపల్లి ఎగతాళి చేశారు . తమ సర్కార్ పై చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనంటూ కొట్టి పారేశారు . ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో అవసరమైన నీటి కేటాయింపులు , అనుమతులు పొందకుండానే మోటారును ఆన్ చేయడం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు కేసీఆర్ ను ఉద్దేశించి.
2023లో కేసీఆర్ చేసిన ప్రాజెక్టు ప్రారంభోత్సవం కేవలం ప్రతీకాత్మకమే తప్పా మరోటి కాదన్నారు జూపల్లి కృష్ణారావు . తన పార్టీ పడిపోతున్న ప్రతిష్టను కాపాడు కోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ కు అంత సీన్ లేదన్నారు. కోల్పోతున్న ప్రతిష్టను తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి నిరాధార విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ దృష్టి సారించడాన్ని సవాలు చేస్తూ, అది నిజమైన ఆందోళన కాదని, కేవలం రాజకీయ ఎత్తుగడ అని అభివర్ణించారు. 10 సంవత్సరాలు పాలించి, రూ. 8 లక్షల కోట్ల అప్పులు పేరుకు పోయినప్పటికీ, కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా నీరందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు జూపల్లి కృష్ణారావు. ప్రధాన కాలువలను కూడా అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు.



















