అమరావతి : శాసనమండలిలో వైసీపీ సభ్యుల వ్యవహారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్కు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ, అదే అంశాన్ని మళ్లీ మళ్లీ తీసుకొచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.ఆధారాలుంటే చూపాలని లేకుంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.
ఇందాపూర్కు హెరిటేజ్కు సంబంధం ఉందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఒక్క చిన్న ఆధారం అయినా చూపించాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కానీ ఆధారాలు చూపకపోగా, బయట ప్రెస్మీట్లు పెట్టి చీజ్ ప్యాకెట్లు చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీజ్,నెయ్యి మధ్య తేడా కూడా తెలియకుండా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యన్నారాయణ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంపై హెరిటేజ్ సంస్థ బొత్సకు లీగల్ నోటీసులు ఇచ్చిందని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆధారాలుంటే చర్చిద్దాం, లేకపోతే అసత్య ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు.
