నెల్లూరు జిల్లా : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కూటమి సర్కార్ పై. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ వెన్నుపోటు కూటమి ప్రభుత్వంలో మైనింగ్ ఓనర్లు పడుతున్న ఇబ్బందులు, దారుణాలను ఆధారాలతో బయట పెట్టడానికే నేను మీ ముందుకు వచ్చాను అని అన్నారు. తాము సత్య హరిశ్చంద్రులం, అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాం అని ఈ వెన్నుపోటు కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు, వాస్తవానికి తన సిండికేట్ ద్వారా ఉన్న సంపదను ఆవిరి చేసే కార్యక్రమం చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. జగన్ ప్రభుత్వంలో క్వార్ట్జ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 55 కోట్ల ఆదాయం వస్తే, ఈ కూటమి ప్రభుత్వంలో అది కేవలం రూ. 11.99 కోట్లకు పడి పోయిందన్నారు. ఇది నా దగ్గర ఉన్న ఆర్టీఐ ఆధారాలతో చెబుతున్న వాస్తవం అని చెప్పారు.
చైనాకు డిమాండ్ తగ్గి క్వార్ట్జ్ ఎగుమతులు ఆగి పోలేదన్నారు. కేవలం సిండికేట్ దురాశ వల్లే ఆదాయం తగ్గిందని ఆరోపించారు. అన్నీ లీగల్గా ఉన్న మైనింగ్ ఓనర్ల దగ్గరికి వెళ్లి టన్నుకు రూ. 8వేల నుంచి రూ. 15వేల వరకు సిండికేట్ దౌర్జన్యంగా వసూలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. గత రెండేళ్ల వ్యవధిలోనే మైన్ ఓనర్లను పిండి, ఈ సిండికేట్ దాదాపు రూ. 200 కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని నేను సూటిగా అడుగుతున్నానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 147 క్వార్ట్జ్ లీజులు ఉంటే, అందులో కేవలం 98 మాత్రమే ఓపెన్ చేశారు. మిగతా 49 మైన్లను వీరికి కప్పం కట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో ఉద్దేశ పూర్వకంగా మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు ఇక్కడ సిండికేట్ నడుపుతూ ఆంధ్రాలో మైనింగ్ను శాసిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చైనా వాడు ఇక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం కచ్చితంగా దేశద్రోహమే, మన దేశ భద్రతకు కూడా ముప్పేనని అన్నారు.
తమ కంపెనీకే మెటీరియల్ ఇవ్వాలని, లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా మైన్లను బ్లాక్ చేయిస్తానని ఆ చైనా వ్యక్తి మన లోకల్ మైన్ ఓనర్లను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. వీపీఆర్ అండదండలతోనే ఈ దందా నడుస్తోందని డౌ చెబుతున్నాడని అన్నారు. దీనికి ఎంపీగా ఉన్న వీపీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఫినీ క్వార్ట్జ్ పేరుతో విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల ఆధ్వర్యంలో ఈ సిండికేట్ నడుస్తోందని ఆరోపించారు. ఆఫీసు సన్షైన్ మెడోస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెం.101లో ఉంది. ఇదంతా ఎవరి కనుసన్నల్లో జరుగుతుందో అందరికీ తెలుసు అన్నారు. వీరి సిండికేట్ వసూళ్ల వల్ల ఒక్కో మండలంలో కనీసం 3 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, జేసీబీలు, కార్లు కొన్న ఓనర్లు ఈఎంఐలు కట్టలేక రోడ్డున పడ్డారని అన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే 2000 సంవత్సరాల పురాతన సిద్ధుల కోన శివుడి కొండను ఆక్రమించి అక్రమంగా ఫెల్స్పార్ మైనింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ఎంక్వైరీ చేయమని దేవాదాయ మంత్రికి లేఖ రాసినా అధికారులకు దిక్కు లేదన్నారు.
