Gaja Vahanam : తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ (TTD). ఉత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనంపై దర్శనం ఇచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
TTD Gaja Vahanam Seva
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగ భాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వ భౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజ వాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవ రూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుం ఉంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు నిలిచాయి. శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంతో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి. రంగురంగుల అలంకారాలతో గజ వాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : YouTube Pays Huge Amount to Trump : ట్రంప్ కు యూట్యూబ్ 22 మిలియన్ల చెల్లింపు
