తిరుపతి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జరిగిన హనుమంత వాహనసేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. స్వామి వారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై విరాజిల్లుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల ఆరో రోజు సందర్భంగా హనుమంతునిపై ఆసీనులైన శ్రీ వేణుగోపాల స్వామివారు త్రేతాయుగంలో శ్రీమహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన మహోన్నత ఘట్టాన్ని స్మరింపజేశారు. స్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు ఆనందభాష్పాలతో పరవశించి పోయారు.
వాహన సేవ మార్గమంతా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, గోవింద నామ సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు ఉత్సవానికి విశేష శోభను చేకూర్చాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం హనుమంత వాహనంపై శ్రీరామ స్వరూపంలో దర్శనమిచ్చే స్వామివారిని సేవించడం ద్వారా భోగమోక్షాలు, జ్ఞాన విజ్ఞానాలు, అభయం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి గజవాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. 7వ రోజు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
